జననం మరియు బాల్యము
అధ్యాయం II – జననం మరియు బాల్యము
గదాధర్ జననం
ఖుదీరామ్ మరియు చంద్రమణిదేవి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న పవిత్ర ఘడియ చివరకు సమీపించింది. 1836 ఫిబ్రవరి 18న తెల్లవారుజామున ఒక గుడిసెలో (అక్కడ వడలిక యంత్రం మరియు చిన్న పొయ్యి ఉండేవి) చంద్రమణిదేవి ఒక కుమారుడిని ప్రసవించింది. ఆ బాలుడు తరువాత ప్రపంచానికి శ్రీ రామకృష్ణ పరమహంస గా ప్రసిద్ధి చెందాడు. పండిత జ్యోతిష్కులు ఆ శిశువు భవిష్యత్తు గొప్పదిగా ఉంటుందని సూచించారు. ఖుదీరామ్ తన కుమారుని గొప్పతనం తనకు గయలో కలిగిన దర్శనాన్ని మరియు చంద్రమణిదేవి అనుభవాన్ని ధృవీకరించిందని భావించి ఆనందంతో మునిగిపోయాడు. ఆయన ఆ శిశువుకు “గదాధర్” అనే పేరు పెట్టాడు (గయలో తన కలను స్మరించుకుంటూ).
గదాధర్ జననం నుండి, ఆయన తన తల్లిదండ్రులు మరియు బంధువులపై మాత్రమే కాక, పొరుగువారిపై కూడా మాయాజాలం వేసినట్లు ప్రభావం చూపాడు. “గదాయి” అని ప్రేమతో పిలవబడే ఆ శిశువును చూడటానికి ఖుదీరామ్ ని ఇంటికి వచ్చేందుకు గ్రామస్థులు అవకాశం దొరికినప్పుడల్లా ప్రయత్నించేవారు.
పాఠశాలలో గదాధర్
సంవత్సరాలు గడిచాయి, గదాధర్ ఐదేళ్ల వయస్సు వాడయ్యాడు. ఈ చిన్న వయస్సులోనే అతను అద్భుతమైన తెలివితేటలు మరియు జ్ఞాపకశక్తిని చూపించడం ప్రారంభించాడు. అతను తన పూర్వీకుల పేర్లు, వివిధ దేవతలకు సంబంధించిన స్తోత్రాలు, మరియు ఇతిహాసాలలోని కథలను నేర్చుకున్నాడు.
అతను చాలా చలాకిగా మారడంతో, ఖుదీరామ్ అతన్ని గ్రామ పాఠశాలకు పంపించాడు. పాఠశాలలో గదాధర్ సరైన పురోగతిని సాధించాడు, కానీ గణితంపై అతనికి తీవ్ర అసహనం ఉండేది. అతనికి పాటలు పాడటం, స్నేహితులతో కలిసి నాటకాలు వేయడం అంటే ఎంతో ఇష్టం. అతని దృష్టి అంతా ఆధ్యాత్మికవేత్తల జీవితాలు మరియు స్వభావాల అధ్యయనంపై కేంద్రీకరించబడింది.
గదాధర్కు మొదటి ఆత్మానందం
ఆధ్యాత్మికవేత్తల జీవితాలు మరియు స్వభావాలపై గదాధర్ నిరంతర అధ్యయనం వలన ఆధ్యాత్మిక భావనలు ఉత్తేజితమై అతనిని లోతైన ధ్యానం మరియు తనని తాను మరిచిపోయే స్థితులవైపు నడిపించాయి. అతను పెద్దవాడవుతున్న కొద్దీ, కేవలం ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే కాక, అందమైన ప్రకృతి దృశ్యాలు లేదా హృదయాన్ని తాకే సంఘటనలు కూడా అతనిని తనని తాను మరిచిపోయే స్థితిలోకి తీసుకెళ్లగలవని గుర్తించబడింది. ఈ తరహా ఒక సంఘటన అతని తల్లిదండ్రులు మరియు బంధువులకు తీవ్ర ఆందోళన కలిగించింది.
శ్రీ రామకృష్ణ తన బాల్యంలో కామార్పుకూర్లో జరిగిన ఈ సంఘటనను తన భక్తులకు వివరించారు:
ఆ ప్రాంతంలోని పిల్లలకు అల్పాహారంగా మరమరాలు ఇస్తారు. ధనికులు చిన్న బుట్టలో తీసుకెళ్తారు; పేదవారు వస్త్రంలో మూట కట్టుకొని తీసుకెళ్తారు. వారు రోడ్లపై లేదా పొలాల్లో ఆడేందుకు బయలుదేరుతారు. ఒక రోజు జూన్ లేదా జూలై నెలలో ఆరు లేదా ఏడు సంవత్సరాల వయస్సులో ఉన్న గదాధర్, వరి పొలాలను విడగొట్టే బారిక దారిలో నడుస్తూ బుట్టలో ఉన్న మరమరాలు తింటూ వెళ్తున్నాడు. అప్పుడు అతను ఆకాశాన్ని చూశాడు ఒక అందమైన నల్లని మేఘం వేగంగా వ్యాపించి ఆకాశమంతా కప్పేసింది. అదే సమయంలో, తెల్లటి బంగాళపు బాతుల వలె ఉన్న బరులు తీరిన కొంగలు ఆకాశంలో ఎగిరాయి. ఆ దృశ్యం ఎంతో అందంగా ఉండటంతో అతని మనస్సు దూర ప్రాంతాలకు వెళ్లిపోయింది మరియు అతను స్పృహ కోల్పోయాడు. మరమరాలు చుట్టూ చల్లా చెదురైపోయాయి. కొంతమంది అతన్ని కనుగొని ఇంటికి తీసుకెళ్లారు.
ఇది అతను పూర్తిగా ఆత్మానందంలో స్పృహ కోల్పోయిన మొదటి సంఘటన. ఇది ఒక్కసారి మాత్రమే కాదు—ఇలాంటి అనుభవాలు అతనికి మరెన్నో కలిగాయి.
సంచార సాధువులకు సేవ
1843లో ఖుదీరామ్ మరణించాడు, మరియు కుటుంబ బాధ్యతలన్నీ అతని పెద్ద కుమారుడు రాంకుమార్ భుజాలపై పడ్డాయి. ఖుదీరామ్ మరణం గదాధర్ మనసులో గొప్ప మార్పును తీసుకొచ్చింది. తండ్రి ప్రేమను కోల్పోయిన బాధతో పాటు భౌతిక జీవితం తాత్కాలికమనే భావన అతనిలో బలపడింది. చిన్న వయస్సులోనే, అతను సమీపంలోని మామిడి తోట లేదా శ్మశానవాటికకు తరచుగా వెళ్లడం ప్రారంభించాడు. అయితే తన బాధ్యతలను మాత్రం అతను మరచిపోలేదు ఆత్మన్వేషణలో మునిగిపోయి గంటల తరబడి అక్కడ ధ్యానంలో గడిపేవాడు. అయినప్పటికీ తనను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను మాత్రం గదాధర్ మరచిపోలేదు. తల్లి దుఃఖాన్ని తగ్గించేందుకు, ఆమె జీవితంలో ఆనందం మరియు ఓదార్పు నింపేందుకు అతను అన్ని విధాల ప్రయత్నించాడు.
తరువాత, గదాధర్కు కొత్త ఆనందం లభించింది. అదే సంచార సాధువులతో సాంగత్యం. పొరుగున ఉన్న లాహా కుటుంబం నిర్మించిన విశ్రాంతి గృహంలో ఈ సాధువులు ఒకటి రెండు రోజులు ఉండేవారు. ఈ సంచార సాధువులతో కలసి ఉండటం, వారు చదివే ధార్మిక గ్రంథాలను వినటం, గదాధర్లో సహజంగా ఉన్న భావోద్వేగభరితమైన మనసును ధ్యానానికి మరింత ఆకర్షించింది. భౌతిక విషయాల పట్ల అతనిలో ఉన్న విరక్తి భావాన్ని ఇది మరింత ప్రేరేపించింది.
బాల సన్యాసి
ఒక రోజు చంద్రమణిదేవి తన కుమారుడు తన శరీరమంతా బూడిద(భస్మం) పూసుకుని, నారింజ రంగు వస్త్రాన్ని నడుము చుట్టూ ధరించి, ఒక చేతిలో పొడవైన కర్రను, మరో చేతిలో కమండలమును (హిందూ సన్యాసులు ఉపయోగించే నీటి పాత్ర) పట్టుకుని తన ముందు నిలబడినప్పుడు ఆశ్చర్యంతో చూసింది. అతను నిజమైన బాల సన్యాసిలా కనిపించాడు. తల్లి ఆనందపడాల్సిన సమయంలో, ఆమె భయం మరియు ఆందోళనతో కేక వేసింది. అప్పుడు అతను తల్లిని ఓదార్చుతూ తాను సన్యాసిగా మారలేదని కేవలం ఆమెకు కొంత వినోదం కలిగించాలనుకున్నానని చెప్పాడు. అలాగే, తాను సన్యాసి వస్త్రధారణలో ఎలా కనిపిస్తానో ఆమెకు చూపించాలని అనుకున్నానని కూడా అన్నాడు. అయితే, తల్లి అతనితో ఒక హామీ తీసుకుంది. తన అనుమతి లేకుండా అతను జీవితంలో ఎప్పుడూ సన్యాసం తీసుకోకూడదు, ఇంటిని వదిలిపెట్టకూడదు.
రెండవసారి ఆత్మానందం
గదాధర్ గురించి చంద్రమణిదేవికి ఆందోళన కలిగింది. కామార్పుకూర్ నుండి దగ్గరలోని అనూర్ అనే గ్రామంలోగల విశాలాక్షి దేవాలయానికి కొందరు మహిళలతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో, గదాధర్ దేవిని స్తుతిస్తూ పాటలు పాడుతుండగా స్పృహ కోల్పోయాడు. ఆ సమూహంలో ఉన్న మహిళలలో ఒకరైన ప్రసన్నమయి, విశాలాక్షి దేవి పేరును అతని చెవిలో పదే పదే పలికింది. దాంతో గదాధర్ స్పృహలోకీ వచ్చాడు.
ఇది విన్న చంద్రమణిదేవి విపరీతంగా ఆందోళన చెందింది. ఆమె కుమారుడికి ఏదైనా శారీరక సమస్య ఉందేమోనని అనుమానించింది. అయితే ఈ సమయములో గదాధర్ తను ఆ స్థితిలో ఉండటానికి కారణం, తాను దేవీ ధ్యానం చేసినప్పుడు తన మనస్సు దేవిలో లయించడం వల్లనే అని అన్నాడు. ఇలాంటి అనుభూతులు అతనికి చాలాసార్లు కలిగాయి.
సత్యాన్ని ప్రేమించిన గదాయ్
గదాధర్ తొమ్మిది సంవత్సరాల వయస్సు వాడయ్యాడు. ఆయనకు ఉపనయన సంస్కారంలో పవిత్ర తంతువుతో అలంకరించాల్సిన సమయం వచ్చింది. ఈ సందర్భంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.
బ్రాహ్మణ కుటుంబాల్లో ఒక సంప్రదాయం ఉంది. ఉపనయన కార్యక్రమం ముగిసిన వెంటనే, కొత్తగా తంతువును ధరించిన వ్యక్తి తన మొదటి భిక్షను బంధువు నుండో, లేదా అదే సామాజిక స్థాయి ఉన్న బ్రాహ్మణుని నుండో స్వీకరించాలి. అయితే, ఆ సమయంలో గదాధర్ను పెంచిన ధని అనే కమ్మరీకులానికి చెందిన మహిళ గదాధర్కు మొదటి భిక్ష ఇచ్చే అవకాశం ఇవ్వమని ప్రార్థించింది. ఆమె నిజమైన ప్రేమతో చేసిన ఆ అభ్యర్థన గదాధర్ను కదిలించింది మరియు ఆయన అందుకు అంగీకరించాడు. ఇంట్లోని ఇతరుల అభ్యంతరాలు ఉన్నప్పటికీ, గదాధర్ తన మాట నిలబెట్టుకుని ధని చేతినుండే భిక్ష స్వీకరించాడు. ఇది వారి కుటుంబ సంప్రదాయానికి విరుద్ధంగా ఉంది. ఈ సంఘటన ఎంతో ప్రాముఖ్యత కలిగినది, ఎందుకంటే ఇది గదాధర్లో ఉన్న ఆంతరిక ఆధ్యాత్మిక నిబద్ధతను మరియు ముందస్తు దృష్టిని ప్రదర్శించింది. అతనికి కఠినమైన సామాజిక సంప్రదాయాల కంటే ప్రేమ మరియు భక్తి ఎంతో ముఖ్యం.
పండితుల మధ్య తలెత్తిన సందేహాన్ని పరిష్కరించిన గదాధర్
ఆ కాలంలో గదాధర్లో ఉన్న మేధాశక్తి మరియు అద్భుతమైన ఆలోచనా విధానం ఎన్నో సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి. ఉపనయన కార్యక్రమం తర్వాత, ఒక సంఘటన జరిగింది. ఇది ఆయనను గ్రామస్తుల ఎదుట తొలిసారి ఉపాధ్యాయునిగా నిలిపింది. ఆయన వయస్సు అప్పటికి పది సంవత్సరాలు మాత్రమే. ఒక రోజు, స్థానిక జమీందార్ ఇంట్లోని పండితులు ఒక సూక్ష్మ విషయంపై చర్చిస్తుండగా గదాధర్ ఆ చర్చను ఎంతో ఆసక్తిగా వినసాగాడు. వారు సరైన పరిష్కారానికి రావడంలో ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకున్న గదాధర్, ఒక పండితుడితో ఓ సూచన చేశాడు. ఇలా చేయటం సరైన పరిష్కారం అవుతుందేమోనని అడిగాడు. ఆ చిన్నవాడి సూచన చర్చిస్తున్న అంశానికి ఎంతో అనుకూలంగా ఉండటంతో పండితులు ఆశ్చర్యపోయారు. ఆయన పరిపక్వతను చూసి ముచ్చట పడి ఆశీర్వదించారు.
మూడోసారి ఆత్మానందం
ఉపనయనం తరువాత గదాధర్ రఘువీర్, రామెశ్వర శివుడు మరియు శీతల దేవిని భక్తితో ఆరాధించాడు. ఆయన భక్తి అంతగా గాఢంగా ఉండటంతో, ఆ సంవత్సరపు శివరాత్రి సమయంలో సహా అనేక సందర్భాల్లో భావ సమాధి (దైవ చైతన్యం) అనుభవించాడు.
శివరాత్రి నాటి రాత్రి, శివుడిని కేంద్రంగా చేసుకొని యాత్ర అనే సంప్రదాయ నాటకం ప్రదర్శించబడింది. ఈ సందర్భంగా, గదాయ్ స్నేహితుడు గయావిష్ణు అసలు నటుడు అనారోగ్యంతో పాల్గొనలేనందున శివుని పాత్ర పోషించమని గదాయ్ను అభ్యర్థించాడు. ప్రారంభంలో మనస్తాపంతో ఉన్న గదాయ్, చివరకు అంగీకరించి శివుడిగా అలంకరించుకున్నాడు. నాటక ప్రదర్శన సమయంలో, ఆయన ధ్యానంలో పూర్తిగా లీనమయ్యాడు. ఆయన ముఖంలో తేజస్సు కనిపించడం కన్నీళ్లు నెమ్మదిగా కారడం ప్రేక్షకులను తన్మయత్వంలోకి తీసుకెళ్లింది. గదాయ్ మరునాడు ఉదయం వరకు సమాధి స్థితిలోనే ఉండిపోయినందున, నాటకాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. ఇలాంటి ఆత్మానందపు అనుభూతులు ఆయనకు తరచూ కలిగేవే. ఆరంభంలో కుటుంబ సభ్యులు ఆందోళన చెందినా, అనంతరం ఆయన ఆరోగ్యం పై ప్రభావం లేదని అర్థం చేసుకున్నారు.
గదాయి – ఒక అభివృద్ధి చెందుతున్న కళాకారుడు
పాఠశాలలో గదాధర్ పురోగతి బాగానే ఉంది. కొద్దిగా కాలంలోనే ఆయన సులభంగా చదవడం, వ్రాయడం నేర్చుకున్నాడు. అయితే గణితంపై ఉన్న అనాసక్తి మాత్రం కొనసాగింది. ఇంకొక వైపు, ఆయన అనుకరణలో నైపుణ్యం పెరుగుతూ, ఎన్నో సృజనాత్మక శైలులను చూపించడం ప్రారంభించాడు. గ్రామంలో దేవుళ్ల ప్రతిమలను తయారుచేసే మట్టి కుమ్మరులను సందర్శిస్తూ, వారి కళను నేర్చుకున్న అనంతరం ఇంట్లో పదేపదే సాధన చేయడం ఆయనకు అలవాటైంది. ఇది ఆయనకు ఒక వ్యాపకంగా మారింది. అలానే చిత్రకారులతో పరిచయం పెంచుకొని, ఆయన కూడా చిత్రలేఖనం ప్రారంభించాడు. ఒకసారి, గదాయ్ ఒక గ్రామీణ చిత్రకారుడు దుర్గామాత చిత్రాన్ని వేసే విధానాన్ని గమనించాడు. దగ్గరగా పరిశీలించి, ఆ మాత కళ్ళ చిత్రణ సరైనది కాదు అన్న భావన వచ్చి, ఆయన చేతినుండి కుంచె తీసుకుని ఆ కళ్ళను అద్భుతంగా వేశాడు. ఆ ప్రతిమకు దివ్యత్వం కలిగేంత స్థాయికి మార్పు చేశాడు.
తన నాటక బృందంతో గదాధర్
పాఠశాలపై గదాధర్కు ఉన్న అనాసక్తి మరింత పెరిగింది. ఆయన తన స్నేహితులతో కలిసి ఒక చిన్న నాటక బృందాన్ని ఏర్పాటు చేశాడు. మామిడి తోటలోనే వేదికను ఏర్పాటు చేసి, రామాయణం మరియు మహాభారతం కథల ఆధారంగా నాటకాలు ప్రదర్శించేవారు. వృత్తిపరమైన నటుల నుండి వినిన కథల వల్ల, ఆయనకు దాదాపు అన్ని పాత్రలు బాగా గుర్తుండేవి. ఆయనకు అత్యంత ఇష్టమైన అంశం కృష్ణుని బృందావన ఘట్టం (కృష్ణుడు, గోపికలు మరియు గోప బాలుల మధ్య ప్రేమ కథలు). గదాధర్ రాధ లేదా కృష్ణ పాత్రలు పోషిస్తూ, ఆ పాత్రలో పూర్తిగా లీనమయ్యేవాడు. ఆ మామిడి తోట అంతా బాలలు సమూహంగా పాడే సంకీర్తనలతో మార్మోగేది. ఆయన ఈ దైవ లీలల్లో అంతగా మునిగిపోయి, పాఠశాల విద్యపై ఆసక్తిని కోల్పోయి, ఇతిహాసాలు, పురాణాలు, మరియు ఇతర పవిత్ర గ్రంథాల అధ్యయనంలో నిమగ్నమయ్యాడు. ఇవి ఆయనకు ఆధ్యాత్మిక ప్రేరణను ఇచ్చాయి. అయితే, ఆయన యొక్క ఈ లోకానికి అతీతమైన వైఖరి అన్నలలో తీవ్ర ఆందోళనను కలిగించింది.
కామార్పుకూర్కు వీడ్కోలు
ఆ కుటుంబాన్ని వరుస దుర్దినాలు చుట్టుముట్టాయి. రామ్కుమార్ భార్య మరణించడంతో, ఆమె శిశువు పాలన బామ్మ భుజాలపై వచ్చి పడింది. రామ్కుమార్ ఆదాయం తగ్గిపోవడంతో అప్పులలో చిక్కుకొని, జీవనోపాధి కోసం కోల్కతాకు వెళ్లి ఒక సంస్కృత పాఠశాల ప్రారంభించాడు. ఇంటిపనుల బాధ్యత రామేశ్వర్ భుజాలపై వేసారు, కానీ గదాధర్ రఘువీర్ను ఆరాధించడంలో మరియు తల్లికి ఇంటి పనులలో తోడుగా ఉండడంలో తన సమయాన్ని గడిపేవాడు. విద్యపై అతని అనాసక్తి మరింత పెరిగింది. మరియు తన జీవితంలో ఒక గొప్ప కార్యసాధన కోసం విధివశంగా పుట్టినవాడినని ఆయనకు స్పష్టత వచ్చింది (ఇంకా ఆ లక్ష్యం ఏమిటో తెలియకపోయినా). ఆయన భగవంతుని కోసం అన్నింటిని వదిలివేయాలన్న ఆంతరిక నిర్ణయానికి వచ్చాడు. చివరకు, తాను ఎదుర్కొంటున్న కష్టాల నుండి బయటపడే మార్గాన్ని రఘువీర్ చూపిస్తాడన్న నమ్మకంతో జీవించ సాగాడు.
ఇంతలో, కోల్కతాలో తన బాధ్యతలన్నింటిని ఒంటరిగా నిర్వహించడంలో రామ్కుమార్కు తీవ్రమైన కష్టాలు ఎదురయ్యాయి. ఒకసారి కామార్పుకూర్కు వచ్చినప్పుడు, గదాధర్కు పాఠశాలపై ఉన్న నిర్లక్ష్యాన్ని గమనించాడు. అతను తన స్నేహితులను మరియు ఆటపాటలను వదిలేశాడని తెలిసినప్పుడు, రామ్కుమార్ అతన్ని నగరానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ అతని చదువును పర్యవేక్షించవచ్చు మరియు తన పనుల్లో సహాయం చేయించవచ్చు అని అనుకున్నాడు. గదాధర్ ఈ ప్రతిపాదనకు సంతోషంగా అంగీకరించాడు మరియు ఒక శుభదినాన రఘువీర్ మరియు తల్లి ఆశీర్వాదాలతో కోల్కతా ప్రయాణం ప్రారంభించాడు.














