భక్తుల సాంగత్యంలో

Print Friendly, PDF & Email
అధ్యాయం X – భక్తుల సాంగత్యంలో

శ్రీరామకృష్ణులు తన జీవితంలో మూడు వంతుల భాగాన్ని కష్టమైన సాధనల్లో గడిపి సంపాదించిన ఆధ్యాత్మిక రత్నాలు ఇప్పుడు మానవాళికి అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. 1875లో, శ్రీరామకృష్ణులు బ్రహ్మ సమాజ నాయకుడైన కేశవ్ చంద్ర సేన్‌ను కలిశారు. ఆ కాలంలో కేశవ్ ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఉన్నారు. కేశవ్ మరియు ఆయన అనుచరులు తమ పత్రికలలో శ్రీరామకృష్ణుల జీవితం మరియు బోధనలను ప్రచురించడం ప్రారంభించారు. ఫలితంగా అనేక మంది దక్షిణేశ్వర్ మహాత్ముడి గురించి తెలుసుకున్నారు.

బ్రహ్మ సమాజంతో సంబంధం ఏర్పడిన తరువాత, శ్రీరామకృష్ణులు తన బోధనలను అత్యంత శ్రద్ధతో అనుసరించగల శిష్యులను కలవాలనే తపన మరింత పెరిగింది. ఒక తండ్రి ప్రేమతో, తాను సంపాదించిన ధనాన్ని తన పిల్లలకు ఇవ్వాలనుకుంటాడు, అలాగే నిజమైన గురువు తన ఆధ్యాత్మిక సంపదను తన శిష్యులకు ఇవ్వాలనుకుంటాడు. శిష్యుల కోసం ఆయన తపనపై శ్రీరామకృష్ణులు స్వయంగా చెప్పిన వాక్యాలు ఇవే, “ఆ కాలంలో నాకు కలిగిన తపనకు ఎటువంటి హద్దులు లేకపోయినవి. దినమంతా ఆ తపనను ఏదో విధంగా నియంత్రించేందుకు ప్రయత్నించేవాడిని. లౌకిక సంభాషణలు నాకు బాధను కలిగించేవి. నా ప్రియమైన సహచరులు మర్నాడే వస్తారేమో అనే ఆశతో ఎదురుచూస్తూ ఉండేవాడిని. వారితో సంభాషించడం, నా హృదయానుభూతులను పంచుకోవడం ద్వారా ఓదార్పు పొందాలనే ఆకాంక్ష కలిగినది. ప్రతి చిన్న సంఘటన కూడా వారిని గుర్తు చేసేది. వారి ఆలోచనలు నా మనస్సును సంపూర్ణంగా ఆక్రమించేవి. నేను అప్పటికే నా హృదయంలో, ఒకరికి ఏమి చెప్పాలి, మరొకరికి ఏమి అందించాలి అనే విధంగా ఆలోచనలు చేసేవాడిని. అయితే, ప్రతి రోజు ముగిసినప్పుడు నా భావోద్వేగాలను అదుపులో ఉంచలేకపోయేవాడిని. ‘ఇంకొక రోజు గడిచిపోయింది, వారు రాలేదు’ అనే ఆలోచన నన్ను తీవ్రంగా కలచివేసేది. సాయంత్రపు పూజ సమయములో ఆలయాల నుండి గంటల మ్రోగింపులు, శంఖధ్వనులు వినిపించినప్పుడు, నేను తోటలోని కూతి పైకప్పునకు ఎక్కి హృదయ వేదనతో వంగి నా గొంతును గట్టిగా ఎత్తి ఇలా పిలిచేవాడిని, “రండి, నా పిల్లలూ! ఓహ్, మీరు ఎక్కడ ఉన్నారు? మీరు లేకుండా నేను జీవించలేను!” తల్లి తన బిడ్డను చూడాలనే తపన కన్నా, స్నేహితుడు తన మిత్రులను కలుసుకోవాలనే ఆకాంక్ష కన్నా, ప్రేమికుడు తన ప్రియురాలిని చూడాలనే తపన కన్నా నేను వారిని దర్శించాలనే తపన అధికమైనది. ఓహ్! ఆ తపన వర్ణనాతీతమైనది! ఇది జరిగిన కొద్ది కాలానికే భక్తులు రావడం ప్రారంభించారు.”

శ్రీరామకృష్ణుల పిలుపుకు స్పందించిన మొదటి ఇద్దరు వ్యక్తులు కలకత్తా (ఇప్పటి కోల్‌కతా) నుండి వచ్చిన బంధువులు రామచంద్ర దత్త మరియు మనోమోహన్ మిత్ర. శ్రీరామకృష్ణుల యొక్క దయ, స్నేహభావం మరియు అనురాగం కారణంగా అనేక మంది కలకత్తా ప్రజలు ఆయన వైపు ఆకర్షితులయ్యారు. ఆయన ప్రేమ నిజమైనది మరియు స్వార్థరహితమైనది ఇది ఆయన భక్తుల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొచ్చింది.
ఆదివారాల్లో దక్షిణేశ్వర్‌లోని శ్రీరామకృష్ణులు గది భక్తులతో నిండిపోయేది. ఈ సమావేశాలు ఆనందభరితమైన సందర్భాలుగా ఉండేవి. అందరూ కలిసి భక్తిగీతాలు పాడేవారు. శ్రీరామకృష్ణులు కూడా పాల్గొని పాడుతూ నృత్యం చేసేవారు. భక్తులు ఆయన చుట్టూ వలయంగా నృత్యం చేసేవారు. కొన్నిసార్లు ఆయన కదలకుండా నిలిచిపోయి భగవంతునిలో లీనమయ్యేవారు. భక్తులు ఆశ్చర్యంతో ఆయనను తిలకించేవారు. దక్షిణేశ్వర్‌లో అనేక రోజులు ఈ విధంగా గడిచాయి.

ఈ భక్తులు పరస్పరం పరిచయమయ్యారు మరియు శ్రీరామకృష్ణుల మార్గదర్శనంలో ఆధ్యాత్మిక సాధన చేస్తున్న వారు ఒక రకమైన ఆధ్యాత్మిక బంధుత్వాన్ని ఏర్పరచుకున్నారు. అప్పుడప్పుడూ శ్రీరామకృష్ణులు కలకత్తా నుండి వచ్చిన ఆహ్వానాలను స్వీకరించి భక్తులను సందర్శించేవారు. ఈ సమావేశాలు క్రమంగా చిన్న పండుగల రూపాన్ని తీసుకున్నాయి.

ఇలాంటి వందలాది నిజమైన భక్తులు మరియు శిష్యులు శ్రీరామకృష్ణుల చుట్టూ సమీకరించబడ్డారు. ఆయన నిగూఢమైన వాక్యాలు మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం భక్తుల జీవన మార్గాన్ని పూర్తిగా మార్చి వారిని ధన్యులుగా చేసింది.

గృహస్థుల కోసం శ్రీరామకృష్ణుల బోధనలు, వారిలో మానసిక వైరాగ్యం కలిగించి మరియు కుటుంబ బాధ్యతలను నెరవేర్చుతూ భగవంతుని పైననే ధ్యాసతో జీవించడాన్ని ప్రధానంగా పేర్కొన్నాయి.
ఆయన సూచనలు:

  1. భగవంతుని నామాన్ని జపిస్తూ ఆయన మహిమలను గురించి ఆలోచించండి.
  2. సాధు సాంగత్యము, సత్సాంగత్యము చేయండి. పవిత్ర ప్రదేశాలను సందర్శించండి.
  3. అప్పుడప్పుడూ ఒంటరిగా ఉండే ప్రదేశానికి వెళ్లి ధ్యానం చేయండి. మీ భక్తి భావాలను మరియు ఆలోచనలను పెంపొందించుకోండి.
  4. సత్యాసత్యాలు, నిజానిజాలు, నిత్యానిత్యాలు, సత్‍అసత్‍ల గురించి నిరంతరం విచారణ చేయండి. దేవుడు మాత్రమే నిజమైనవాడు, నిత్యుడు, శాశ్వతుడు, సత్యుడు.
  5. గృహస్థునిగా మీ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించండి, కానీ ఏది మీది కాదు అనే భావనతో ఉండండి.

రామచంద్ర దత్త, మనోమోహన్ మిత్ర, సురేంద్రనాథ్ మిశ్రా, కేదారనాథ్ చటర్జీ, సురేష్ చంద్ర దత్త, గిరీష్ చంద్ర ఘోష్, నాగ మహాశయ్, మహేంద్రనాథ్ గుప్తా మరియు బాలరాం బోస్ మొదలైనవారు ఆయన ప్రముఖ గృహస్థ భక్తులలో కొందరు.

శ్రీరామకృష్ణులు దేవేంద్రనాథ్ ఠాగూర్, మైఖేల్ మధుసూదన్, కృతోదాస్ పాల్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మరియు బంకిమ్ చటర్జీ వంటి ప్రముఖులతో కూడా పరిచయం పొందారు.

శ్రీరామకృష్ణులు వైరాగ్యం మరియు సేవా భావంతో నిండిన స్వచ్ఛమైన మరియు నిజాయితీ గల శిష్యుల సమూహాన్ని ఊహించారు. ఈ శిష్యులు ఆయన యొక్క విశ్వ ప్రేమ మరియు సామరస్య సందేశాన్ని స్వీకరించి శ్రీరామకృష్ణుల స్పర్శతో శక్తివంతమైన ఆధ్యాత్మిక వ్యక్తులుగా మారిపోయారు. ఈ శిష్యుల సమూహం ప్రధానంగా సన్యాస జీవితం స్వీకరించిన యువకులతో కూడి ఉంది. వారిలో నరేంద్రనాథ్ దత్త ఒక అద్భుత యువకుడు. బలమైన శరీరం, విశాలమైన కళ్ళు, మధురమైన గాత్రం, పదునైన బుద్ధి, అద్భుతమైన జ్ఞాపకశక్తి మరియు నాయకత్వ లక్షణాలు కలవాడు. ఆయన హృదయం స్వచ్ఛమైనది మరియు భగవంతుని తెలుసుకోవాలని తపన కలిగి ఉండేది.

ఆయన కలకత్తాలోని అనేక గొప్ప వ్యక్తులను కలిసినప్పుడు దేవుడు మరియు మతం గురించి ప్రశ్నలు అడిగేవారు. వారు ఆయనను సంతృప్తిపరిచే సమాధానాలు ఇవ్వలేకపోయారు. చివరికి ఒక రోజు ఆయన ప్రొఫెసర్ ద్వారా శ్రీరామకృష్ణులు గురించి విన్నారు. అలా ఒక రోజు ఆయన శ్రీరామకృష్ణులును కలవడానికి వెళ్లారు.

నరేంద్ర గది లోకి ప్రవేశించిన వెంటనే, శ్రీరామకృష్ణులు ఆయనను పాత పరిచయస్థుడిలా ఆదరించారు. నరేంద్ర తనకు ఎదురైన ప్రతి గొప్ప వ్యక్తిని అడిగిన ప్రశ్నను శ్రీరామకృష్ణులను అడిగారు, “సర్, మీరు దేవుడిని చూశారా?”

శ్రీరామకృష్ణులు వెంటనే సమాధానం ఇచ్చారు, “అవును, నేను ఆయనను చూస్తున్నాను. నిన్ను చూస్తున్నంత స్పష్టంగా. కానీ ఇంకా ఎక్కువగా.” ఆయన కొనసాగించారు, “దేవుడిని అనుభవించవచ్చు, చూడవచ్చు మరియు మాట్లాడవచ్చు కానీ ఎవరు పట్టించుకుంటారు? ప్రజలు డబ్బు మరియు ఆనందం కోసం ఏడుస్తారు కానీ దేవుడి కోసం ఎవరు ఏడుస్తారు?”

ఇది నరేంద్రను బాగా ప్రభావితం చేసింది. మొదటిసారి దేవుడిని చూశానని చెప్పిన వ్యక్తిని ఆయన చూశారు. అందుకే ఆయన శ్రీరామకృష్ణుల పట్ల గొప్ప గౌరవాన్ని అభివృద్ధి చేసుకున్నారు. కాలక్రమంలో ఈ సంబంధం గురుశిష్య సంబంధంగా మారింది. ఆ శిష్యుడు మరెవరో కాదు, శ్రీరామకృష్ణులు సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసిన ప్రసిద్ధ స్వామి వివేకానంద!

శ్రీరామకృష్ణుల సన్యాస జీవితం కోసం శిక్షణ ఇచ్చిన శిష్యులు: స్వామి వివేకానంద, స్వామి అబేధానంద, స్వామి అద్భుతానంద, స్వామి అద్వైతానంద, స్వామి అఖండానంద, స్వామి బ్రహ్మానంద, స్వామి నిరంజనానంద, స్వామి నిర్మలానంద, స్వామి ప్రేమానంద, స్వామి రామకృష్ణానంద, స్వామి శారదానంద, స్వామి శివానంద, స్వామి సుబోధానంద, స్వామి త్రిగుణాతీతానంద, స్వామి తురీయానంద, స్వామి విజ్ఞానానంద మరియు స్వామి యోగానంద.

శ్రీరామకృష్ణుల అనుభూతి ఆయనను పురుషులు మరియు మహిళలతో ఒక చిన్నపిల్లల స్వచ్ఛత మరియు సరళతతో మెలగగలిగేలా చేసింది. ప్రతి మహిళను ఆయన జగన్మాతకి సజీవరూపంగా చూశారు. ఆధ్యాత్మిక మార్గదర్శనం మరియు భగవంతుని అనుభూతి కోసం ఆయనను ఆశ్రయించిన మహిళా భక్తులు ఆయన సమక్షంలో ఏమాత్రం అసౌకర్యం అనుభవించలేదు. ఆయన వారి ఆలోచనలను చదవగలిగేవారు. వారి భావాలను పురుషులవలె సులభంగా అర్థం చేసుకునేవారు. ఆయన మనస్సు పూర్తిగా పవిత్రమైనదిగా ఉండటంతో ఆయన వారిలో అత్యున్నత భావాలను మాత్రమే ప్రేరేపించగలిగారు. ఆయన వారికి కామం మరియు ధనలోభాన్ని త్యజించమని, భగవంతుని అనుభూతి కోసం సాధన చేయమని సూచించారు.

యోగిన్–మా, గోలాప్–మా, అఘోర్మణి దేవి (గోపాల్ తల్లి అని ప్రసిద్ధి), గౌరీ–మా మరియు లక్ష్మీమణి దేవి మొదలైనవారు శ్రీరామకృష్ణుల యొక్క ప్రముఖ మహిళా భక్తులలో కొందరు. వారి స్వచ్ఛమైన, కలుషితరహిత భక్తి మరియు సంపూర్ణ ఆత్మనివేదనం వారిని కుల, లింగ పరిమితులను అధిగమించి పరమానందాన్ని పొందే స్థితికి తీసుకెళ్లింది. శ్రీరామకృష్ణుల యొక్క దివ్య ప్రేమ వారి జీవితాలను మారుస్తూ వారిని పరమానందం పొందే వారిగా మార్చింది. ఈ మహిళలలో చాలామంది శ్రీరామకృష్ణుల జ్ఞానాన్ని వినేందుకు చాలా దూరం నుండి నడిచి వచ్చే వారు. ఆయన వారి ఆకాంక్షలను నెరవేర్చారు మరియు అనేక ఆధ్యాత్మిక అన్వేషకులకు ఓదార్పు కలిగించే మహిళా భక్తుల ప్రకాశవంతమైన సమూహాన్ని నిర్మించారు.

ఒకప్పుడు నిశ్శబ్దంగా మరియు ఒంటరిగా ఉన్న దక్షిణేశ్వర్ ఇప్పుడు వందలాది ఆధ్యాత్మిక అన్వేషకులకు ఆశ్రయంగా మారింది. వారు ఉదయం నుండి రాత్రి వరకు ఆయన చిన్న గదిలోకి చేరి ఆధ్యాత్మిక మార్గదర్శనం పొందేవారు. శ్రీరామకృష్ణులు తన వ్యక్తిగత సౌకర్యం గురించి ఏమాత్రం ఆలోచించకుండా, ఈ తపనతో కూడిన అన్వేషకుల ఆధ్యాత్మిక అవసరాలను ఎప్పటికప్పుడు ఉత్సాహంగా, శ్రద్ధగా తీర్చేవారు.

కొన్నిసార్లు ఆయన గది గంటల తరబడి భక్తులతో నిండిపోయేది. ఆయనకు భోజనం చేయడానికి లేదా కొద్దిగా విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం దొరకేది కాదు. బాధపడుతున్న ప్రతి ఒక్కరికోసం ఆయన హృదయం స్పందించేది. తెలిసినవారు, తెలియని వారందరికీ ఆయన తన ప్రేమ మరియు కరుణను సంపూర్ణంగా అందించేవారు. ఆయన భక్తిగీతాలు, జ్ఞానదాయక బోధనలు మరియు తన ఆధ్యాత్మిక సాధనలు, అనుభూతుల కథనాల ద్వారా ఈ భక్తులకు ప్రేరణనిచ్చేవారు.

కొన్నిసార్లు ఆయన గది భక్తులు పాడే గీతాల ఉత్సాహభరిత స్వరాలతో మార్మోగేది. ఆ వాతావరణం పూర్తిగా ఆధ్యాత్మికతతో నిండిపోయేది మరియు శ్రీరామకృష్ణులను సన్నిహితంగా కలిసిన ప్రతి ఒక్కరూ భగవంతుని అనుభూతి కోసం ఉత్సాహంతో నిండిపోయేవారు. పుష్పం వికసించినప్పుడు తేనెటీగలు ఆహ్వానం లేకుండానే వచ్చి తేనెను పీలుస్తాయి అనే సామెత ఉంది. శ్రీరామకృష్ణులు విషయంలో ఇదే జరిగింది. ఆయన ఆధ్యాత్మిక జీవితం ద్వారా అన్ని మతాల, అన్ని స్థాయిల ప్రజలు ఆయన వైపు ఆకర్షితులయ్యారు.

కానీ అనేక భక్తులకు నిరంతర ఆధ్యాత్మిక ఉల్లాసం కలిగించడం మరియు మతపరమైన ఉపన్యాసాల ఒత్తిడితో ఆయన ఆరోగ్యం బలహీనమై క్షీణించసాగింది. అయినా ఆయన శారీరక శ్రమ ఎంత ఎక్కువైనా బాధపడుతున్న భక్తులకు ఆధ్యాత్మిక ఓదార్పు ఇవ్వడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు, ఒకవేళ వారు వేళకానివేళలో వచ్చినాకాని. ఆయన ఎవరినీ తిరస్కరించలేదు. ఆయన తాత్కాలిక శరీర బలహీనతను అజ్ఞానంతో బాధపడుతున్న మానవాళి పట్ల ఆయనకు ఉన్న అనంత కరుణ దూరం చేసేది.

ఆయన ఇలా అంటారు, “ఒక ఆత్మకు సహాయం చేయగలిగితే, నేను కుక్క రూపంలో అయినా పునర్జన్మలు పొందడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక మనిషికి సహాయం చేయడానికి ఇరవై వేల శరీరాలను త్యజించడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక వ్యక్తికి సహాయం చేయడం గొప్ప విషయం.”

అంతగా ఆయనకు అందరి పట్ల శ్రద్ధ ఉండేది. ఆయన భావ సమాధి స్థితిలోకి వెళ్లినందుకు కొన్నిసార్లు తనను తానే నిందించేవారు, ఎందుకంటే ఆ స్థితి వల్ల ఇతరుల ఆధ్యాత్మిక ప్రయోజనానికి ఉపయోగపడే సమయం కోల్పోతున్నానని భావించేవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *