నమ్మాళ్వార్
నమ్మాళ్వార్

నమ్మాళ్వార్ తిరుక్కురుగూర్ అనే ఊరులో జన్మించారు. దీనిని అళ్వార్ తిరునగరి అని కూడా అంటారు. ఆయన కరియార్ మరియు ఉదయ నంగయ్యర్లకు, ప్రమాధి నామ సంవత్సరం, వైకాసి తమిళ నెల, విశాఖ నక్షత్రంలో జన్మించారు. ఈయన పుట్టినప్పటి నుండే అసాధారణంగా ఉన్నారు. ఏడవలేదు, కదలలేదు, కళ్లను తెరవలేదు, పాలను లేదా ఆహారాన్ని తీసుకోలేదు. ఆయనకు “మారన్” మరియు “సటగోపన్” అని పేరు పెట్టారు. తల్లిదండ్రులు దీన్ని ఎటువంటి దైవత్వంగా భావించకుండా, తిరుక్కురుగూర్లోని అధినాథ స్వామికు మొక్కుకున్నారు. ఆ శిశువును ఆలయం పక్కన ఉన్న చింతచెట్టు కింద ఒక ఊయలలో పడుకోబెట్టారు. అక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆ శిశువు ఊయల నుండి చింతచెట్టు దాకా పాకి యోగ భంగిమలోకి వెళ్ళి, 16 సంవత్సరాలు ధ్యానం చేశారు. తరువాత ఆయన తమిళ కవి మరియు పండితుడు శ్రీ మధురకవి ఆళ్వార్ను కలిశారు. ఆయన నమ్మాళ్వార్ని ఈ లోకానికి తిరిగి తీసుకువచ్చారు, తన మొదటి మాటను మాట్లాడేలా చేశారు. మారన్లో ఉద్భవించిన దైవతత్వాన్ని గమనించిన మధురకవి, ఆయన మొదటి శిష్యుడిగా మారారు. శ్రీ మధురకవి ఆళ్వార్ మారన్ను “నమ్మ్-ఆళ్వార్” అని పేరు పెట్టారు. అంటే ‘మన స్వంత పవిత్ర స్వామి’ అని అర్థం. మధురకవి ఆళ్వార్ తన గురువు యొక్క మహిమను ప్రశంసిస్తూ 11 పాసురాలు (కవితలు) రచించారు. నమ్మాళ్వార్ నాలుగు అద్భుతమైన రచనలు చేశారు. ఇవి నాలుగు వేదాలకు సమానంగా పరిగణించబడతాయి.

- తిరువిరుట్టం – ఇది ఋగ్వేద సారాన్ని కలిగి ఉన్న 100 శ్లోకాల సేకరణ
- తిరువాసిరియం – యజుర్వేద సారాన్ని కలిగిన 7 శ్లోకాల సేకరణ
- పెరియా తిరువందాది – అథర్వణ వేద సారాన్ని కలిగిన 87 శ్లోకాల సేకరణ
- తిరువాయ్మొళి – సామవేద సారాన్ని కలిగిన 1002 శ్లోకాల సేకరణ.

తిరువాయ్మొళి అళ్వార్లు రచించిన 4000 శ్లోకాలలో నాలాయార దివ్య ప్రబంధం అనబడే వాటిలో కిరీటంగా భావించబడుతుంది. నమ్మాళ్వార్ తన పాసురాలను మాట్లాడటం ప్రారంభించినప్పటి నుండి 16 సంవత్సరాలు రాశారు. ఆయన నుండి వెలువడిన పాసురాలను ఆయన శిష్యుడు మధురకవి ఆళ్వార్ రచించేవారు. నమ్మాళ్వార్ పదమూడు అళ్వార్లు (విష్ణువు పట్ల భక్తితో మునిగిపోయిన కవులు)లో ఒకరుగా తమిళ సాహిత్యము, దాని సంప్రదాయ కథలకు సంబంధించిన విస్తృత జ్ఞానం కలిగివున్నవారు. తన దివ్య దృష్టి ద్వారా నమ్మాళ్వార్ విష్ణువు యొక్క అనేక రూపాలను దర్శించగలిగారు. ఆదినాథ స్వామి ఆయన పాసురాలకు సంతోషించి వకుల పుష్పాల హారాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. అందుచేత ఆయనను ‘వకులాభరణర్’ అని కూడా పిలిచేవారు. ఆయనకు ఉన్న ఇతర పేర్లు: ‘పరంకుశ’, ‘వేదం తమిళ్ సైదా మారన్’, ‘తిరుక్కురుగైప్పిరాన్’. నమ్మాళ్వార్ తన 32వ ఏట మోక్షం గురించి తన చివరి పాసురాన్ని రచించారు. శ్రీ మహావిష్ణువు స్వయంగా నమ్మాళ్వార్ ముందు ప్రత్యక్షమై వైకుంఠానికి తీసుకెళ్లారు. వైకుంఠ ఏకాదశి రోజున నమ్మాళ్వార్ శ్రీ వైకుంఠంలోకి చేరినట్లు విశ్వసిస్తారు. ఈ పర్వదినానికి అన్ని వైష్ణవ దేవాలయాల్లో ‘వైకుంఠ వాసల్’ లేదా ‘వైకుంఠ ద్వారం’ అనే ప్రత్యేక ద్వారాన్ని భక్తులు దాని గుండా వెళ్లేందుకు తెరిచి ఉంచుతారు. దీనివల్ల వారు మహావిష్ణువు దర్శనాన్ని పొందగలుగుతారు. ఇది వైకుంఠం ద్వారాలు అందరికీ తెరవబడతాయని సూచన.

