సత్యము

Print Friendly, PDF & Email
సత్యము

“బుద్ధి యొక్క నిరంతరాన్వేషణ ఫలితమే సత్యము” అన్నారు బాబా. ఇది పారమార్థిక సత్యము. కాని నైతిక పరిభాషలో సత్యము అనగా మనో, వాక్కాయముల అనుసంధానము, “మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం” అన్నారు.

“తత్ సత్” అని వేదవాక్యము. నిత్యసృష్టిని నిరూపించేదే సత్యము. శాశ్వతమైన సృష్టియొక్క ఆధ్యాత్మిక స్వరూపమును తెలియజేసేదే సత్యము. ప్రతిప్రాణియొక్క, ప్రతి వస్తువు యొక్క సహజ స్వభావాన్ని తెలిపేదే సత్యము. మనలోని దివ్యత్వాన్ని సూచించేదే సత్యము. మనలోని పరిపూర్ణత్వము వ్యక్తము అయినపుడు మన ఆత్మతత్వము నిరూవణ అవుతుంది. బుద్ధియొక్క సత్యాన్వేషణతో ప్రారంభమయినది, బుద్ధి వికసించి అంతస్ఫురణగా మార్పుచెందినపుడు పరిపూర్ణ మవుతుంది. మనస్సు, లౌకిక లేక విషయవాంఛలను విడిచిపెట్టి సత్యముపై ఏకాగ్ర భావము నిలుపు కొనగలిగి, అంతస్ఫురణగా మారగలిగి నప్పుడు, శుద్ధ చైతన్యము బ్రహ్మము అయిన నిత్యసత్యాన్ని దర్శించ గలుగుతుంది. ఇదే త్రికాల సత్యము.

మనస్సును పరిశుద్ధము చేయగల ప్రధానమైన సాధన సత్యవాక్పరిపాలన [ఆడి తప్పకుండుట]. సమాజజీవనంలో ఇది ప్రతివారికి ఎంతో సహాయకారి. అసత్యము మనస్సును మలిన పరచి, సమత్వాన్ని తొలగిస్తుంది. ‘సత్యం నాస్తి పరోధర్మః’ అని శాస్త్రాలు ఘోషించాయి. కాబట్టి సత్యము అన్ని విలువలకు మూలము, ప్రధమ సోపానము కూడా.

మీరు ఎక్కువగా మాట్లాడినప్పుడు, మీ సంభాషణలో సత్యానికి తావుండదు. కనుక మీ సంభాషణను పరిమితం చేయాలి. అందుకే ప్రాచీనులు “తక్కువ మాట్లాడటము, ఎక్కువ పని చేయటము” అనే నియమాన్ని పాటించేవారు. మీ పనులలో మరియు మీ మాటలలో ప్రేమ అనునది ప్రధానమైన అంతర్వాహిని గా వుండాలి. మీ మాటలలో ప్రేమ ఉన్నచో అది సత్యం అవుతుంది. మీ పనులు ప్రేమమయ మైనచో అది ధర్మంగా రూపొందుతుంది. అదే మీకు శాంతినిస్తుంది. (SSS 30.16: జూలై 18, 1997)

1967, డిసెంబర్ 20వ తేదీన కేరళలో ఒక ఉపన్యాసంలో స్వామి ఇలా అన్నారు “మీరు సత్యాన్ని ఎలా పలకాలి అన్నది తెలుసుకోవాలంటే, భారతీయుల ఇతిహాసమైన మహాభారతంలోని భగవద్గీతలో “అనుద్వేగకరం వాక్యం”అన్న శ్లోకములో ఎవరిని బాధించకుండా, సత్యమును ఎలా పలకాలి అన్నది తెలియజేస్తుంది. (ఇతరులకు బాధను, కోపమును లేదా దుఃఖాన్ని కలిగించని మాటలు). అలాగే శాస్త్రాలు” సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్య మప్రియం” (సత్యం పలకండి, ప్రియముగా ఉండే విధంగా మాట్లాడండి, అప్రియమైన సత్యాన్ని మాట్లాడకండి) అని తెలుపుతున్నాయి. కొన్ని మాటలు వినేవారిని సంతోషాన్నిస్తాయి. మన చుట్టూ ఉన్న వారి ఆమోదం కొరకై మాట్లాడకండి. “దుఃఖాన్ని లేదా బాధను కలిగించే సత్యాన్ని మాట్లాడ వలసి వస్తే అప్పుడు మౌనాన్ని వహించండి”ఇదే నిత్య జీవితంలో ఆచరించే సత్య ప్రతిజ్ఞ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *