సుఖమయ జీవితానికి పొదుపు రాచబాట
చిన్న చిన్న నీటి బిందువులే సముద్రంగా అవుతాయి, చిన్నచిన్న మొత్తాలే పొదుపు చేస్తే అది కాలక్రమేణా సంపదగా అవుతుంది. చిన్న చిన్న అడుగులు మనలను భగవంతుని వద్దకు చేరుస్తాయి.
మనలో ప్రతీవారు చిన్నవయస్సు నుండే పొదుపు చేయడం నేర్చు కోవాలి. ఆ అలవాటు మన వ్యక్తిత్వాన్నే, దృక్పధాన్నే మార్చి వేసేటంత ప్రభావం కలిగి వుంటుంది. అది మన జీవిత సరళినే మార్చివేస్తుంది కూడా. ఈ పొదుపు అనేది మూడు స్థాయిల్లో జరగాలి. 1. భౌతికంగా 2. మానసికంగా 3. ఆధ్యాత్మికంగా.
భౌతిక స్థాయిలో పొదుపు రెండు విధాలుగా వుంటుంది. మొదటిది మనం ఉపయోగించే వస్తువులు మోదలగు వానితో. రెండవది శారీరకమైనది. మొదటి దానిలో మనము ఉపయోగించే ఆహార పదార్థములు, ధనము, నీరు మొదలగు ప్రకృతి వనరులు, విజ్ఞాన పరంగా లభిస్తున్న విద్యుచ్ఛకి మొదలై ని వానిని పొదుపుగా వాడడం నేర్చుకోవాలి. శారీరకంగా మనము భగవంతుడు ప్రసాదించిన శక్తిని నీరు, గాలి పోకుండా కాపాడు కోవాలి. అప్పుడే ఆ శక్తి సద్వినియోగం అవుతుంది, ప్రయోజనకారి అవుతుంది. తగిన పరిశ్రమ లేకపోవడం, నియమం తప్పి తినడం ,కట్టుబాటు లేని జీవన విధానము మన భౌతికశక్తిని పోగొట్తాయి.
మానసిక స్థాయిలో మనోశక్తిని నిగ్రహించి, బుద్ధిని వికసింస చేసికోవాలి. ఆ విధంగా విచక్షణ, మనోనిగ్రహము, ఏకాగ్రత మొదలైన వానిని పెంచుకోవాలి.
“ఆత్మైవత్యాత్మనో బంధుః” “ఆత్మైవరిపురాత్మనః” అని గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు. మనస్సే మానవుని ఉన్నత శిఖరాలకు తీసి కొని వెళ్తూంది. అధః పాతాళానికి త్రోసివేస్తుంది. మనస్సనే కళ్ళెం ద్వారా మనం మన జీవిత రధాన్ని నడుపగలము. భయము, దురాశ, ఈర్ష్య కోపము, ఆతురత, గర్వము ఇవి మనస్సును అశాంతికి గురి చేస్తాయి. వినయము, సహనము, స్నేహశీలత, దయ, ప్రేమ ఇవి మన మన శ్శక్తిని పెంచి మనోనిశ్చలతకు తోడ్పడతాయి.
ఆధ్యాత్మిక స్థాయిలో ప్రతివారిలో ఆధ్యాత్మిక తపన ఉంటుంది దానిని అణచి వేయడానికి ఎవరును ప్రయత్నించకూడదు. దానిని ప్రోత్సహించి తగిన ఆహారాన్ని అందించి తృప్తి కలుగజేయాలి. భక్తి, శ్రద్ధతో కూడుకొన్న ధర్మ నిర్వహణే ఈ ఆహారము. ఇదే ఆత్మ సాక్షాత్కారానికి దారి తీస్తుంది.
మానవ జన్మ భగవంతుడు ఇచ్చిన వరప్రసాదంగా భావించి, ఈ మానవ శరీరము ద్వారానే ఆత్మ సౌందర్యాన్ని గుర్తించి ఆత్మ సాక్షి తారాన్ని పొందగలము. పైన చెప్పిన మూడు స్ధాయిల్లో పొదుపును ఏ విధంగా పాటించి గలము అనేది ఇప్పుడు చూద్దాము.
భౌతిక స్థాయిలో:-
ఆహారం విలువ ప్రతి వారికీ తెలుసు, ఆహారం లేకుండా ఒక పూటకూడా ఉండలేము. మనకు ప్రాణం నిలపేది ఈ ఆహారమే. ఇది మన శరీరానికే గాక మనస్సుకు కూడా శక్తి ఇచ్చి, ఆలోచనా సరళిపై ప్రభావాన్ని కలిగియుంటుంది. నిజంగా ఆకలంటే ఏమిటో మనలో చాలా మందికి తెలియదు. భగవంతుని దయవల్ల మనకు అన్నమో రామచంద్ర అనే వరిస్థితి రాలేదు. కాని మనం ఒక్కసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే తెలుస్తుంది. తమ సంగతి సరేసరి. కనీసం తమ బిడ్డలకు కూడా ఒక పూటైనా కడుపునిండా తిండి పెట్టలేని వారు ఎందరో ఉన్నారు. మనమేమో రెండు పూటలా కడుపు నిండా తినడమే కాకుండా, చేతనయినంత పారేస్తున్నాము కూడా. అన్నమే బ్రహ్మము అనే విషయం మనకింకా అర్థం కాలేదని చెప్పవలసి వస్తున్నది. “వేదాలు, పురాణాలు” అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటున్నాయి. మన ఆకుల్లో మనకు కావలసిన దానికంటే ఎక్కువ వేసుకుంటున్నాము, వేయించు కుంటున్నాము. తల్లులు తమ పిల్లలు తినగలిగిన దాని కన్న ఎక్కువ పెట్టి పిల్లలనే పాడు చేస్తున్నారు. ఆహారం విలువ మనకి ఇంకా తెలియదని చెప్పవలసి ఉంటుంది. మనం సాధారణంగా విస్తళ్ళలో వదిలేసిన ఆహారం ఇంక ఇద్దరు ముగ్గురు పిల్లలకు పెట్టవచ్చు.
ఇదిగాక పిల్లలకు, పెద్దలకు గూడా ఆహార విషయంలో కొన్ని మొండి సిద్ధాంతాలు వున్నాయి. కొన్ని కుటుంబాలలో ముగ్గురు, నలుగురు పిల్లలుంటే అందరికీ వేరు వేరు రుచులు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం కూర పచ్చడి కావాలని పట్టుబడతారు. పాపం ఆ తల్లి ఎంతో కష్టువడి ఆ విధంగానే చేస్తుంది. కానీ తిన్నంత తిని, బోలెడంత పారేస్తారు. మనం వృధా చేసే ఆహార పదార్థాలను ఆకలితో అలమటించిపోయే వారికి పెడితే, వారు ఎంతో ఆప్యాయతగా తింటారు. ఇంతకు మించిన సామాజిక సేవ యేమి వుంటుంది.? ఇదే గొప్ప నైతిక, ఆధ్యాత్మిక ధర్మం గూడా. ఆహారాన్ని వదిలేయడం మహా పాపమని, భగవంతుని యెడ అపచారమని తెలుసుకోవాలి. మన దేశంలో ఆహార పదార్థాలు చాలినంత లేవు అవి అంటారు. కానీ అది నిజం కాదు. కావలసినంత ఉంది. కానీ వాటిని సరియైన విధంగా జాగ్రత్తపరచక, సరియైన సరఫరాలేక, వాడకంలో కూడా వృధా చేసి, కృత్రిమమైన లోటును సృష్టిస్తున్నాం. కావున ఈ వృధా చేయడాన్ని అరికట్టడం మన ప్రాథమిక ధర్మం.
ఇక బట్టల విషయానికి వద్దాం. ఫ్యాషన్ పేరుతో రోజుకో జత పరుగెడుతారుకొందరు. నిరాడంబరమైన శుభ్రమైన దుస్తులు మానవుని వ్యక్తి త్వానికి వన్నె తెస్తాయి. మనకు నిజంగా అవసరమైనన్ని దుస్తులు ఉండాలి. కాని బీరువాలలో, పెట్టెలలో మూల్గడానికి కాదు.
ఇదే విధంగా నీటివాడకంలో, విద్యుచ్ఛక్తి వాడకంలో మనము ఎంతో పొదుపు సాధించవచ్చు. నీరు పట్టుకున్న తరువాత పంపు కట్టేసే ఓపిక మనలో చాలా మందికి లేదు. మన కళ్ళెదుట ఒక పంపు కారిపోతుంటే చూస్తూ పట్టించుకొనము. అది మనకెందుకు అనుకుంటాం, గదిలో మనుష్యులు లేకపోయినా పంకాలు తిరుగుతూ ఉంటాయి. దీపాలు వెలుగుతుంటాయి. కాని మనం పట్టించు కొనము. మనదేశంలో త్రాగే నీళ్ళకు, విద్యుద్దీపాలకు నోచుకోని ఎన్నో గుడిసెలు వున్నాయి. అక్కడి పిల్లలకు స్నానం లేదు. చదుపుకోడానికి దీపాలు ఉండవు. మనము చేసే పొదుపు చిన్నదైనా అది దేశ సౌభాగ్యానికి ఎంతో తోడ్పడుతుందని ప్రతివారు గ్రహించడం అవసరం.
మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలో:
ఇంక మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలో పొదుపు చేయడం ఎలాగో చూద్దాం. ప్రతి దినం ఉదయం, సాయంత్రం, రాత్రి, కనీసం ఒక్క పూటయినా కొన్ని నిమిషముల పాటు, మౌనము, ధ్యానము, ఇటు శరీరానికి, అటు మనన్సుకు ఎంతో ప్రశాంతత కలిగించి, సమాజిక శక్తిని యిస్తాయి. భగవంతుని మీద తప్ప, మరే యితర విషయంమీద ధ్యాస లేకుండా కూర్చోగలగడం ప్రతి వారు అభ్యసించాలి. దీనికి జ్యోతి ధ్యానం చాలా అనుకూలమయినది. ఈ ఆలవాటు మనసుకు ఊరట కలిగించి బుద్ధికి పదును పెట్టి, ఏకాగ్రతను పెంపొందిస్తుంది, దీనివలన మనం చేసే పనులలో సామర్థ్యం ఇనుమడిస్తుంది. దీనితోపాటు భగవన్నామస్మరణ కూడా చేర్చుకుంటే మన జీవితం నిజంగా సార్థకమయినట్లే భావించవచ్చు.
తాత్కాలిక ఉల్లాసం కలిగించే, ఏహ్యభావం కలిగించే పుస్తకాలు చదవడం, అశ్లీలమైన సినిమాలు చూడటం, వీటివలన మనన్సు వ్యధకు లోనవుతుంది. కాబట్టి మనస్సుకు ఏమి అందిస్తున్నామో, వాటి విషయంలో విచక్షణ చూపాలి. ఒక వేదసూక్తి వుంది — “భద్రం పశ్యంతు, భద్రం శ్రవణంతు, భద్రం కుర్యంతు” “మంచిని చూడు, మంచిని విను, మంచినే చేయి.” ఈ నాడు మన దృష్టిని అనేక కృత్రిమ విషయాలవైపు లాగే ఈ ప్రపంచంలో ఈ వేద సూక్తిని అందరూ పాటించడం ఎంతో మేలు చేస్తుంది.
ధనాన్ని పొదుపుచేయడం:-
“ధనమూల మిదం జగత్” అని సూక్తి ఉంది. “చతుర్విధ పురుషార్థముల”లో ‘అర్ధము’, అనగా భౌతిక జీవితంలో సంపద కూడా పొందడానికి ప్రయత్నం చేయాలి. కాని ఈ సంపాదన ధర్మానికి లోబడి చేయమని శాస్త్రాలు చెపుతున్నాయి. అన్ని పురుషార్థాల లక్ష్యం మోక్ష సాధనయే అని గమనించాలి.
గృహస్థాశ్రమం:, భారతీయ సంస్కృతిలో గృహస్థాశ్రమానికి విశేష ప్రాధాన్యం యివ్వబడింది. సామాజిక జీవనానికి ఇది మూలస్తంభం వంటిది. గృహ స్థునికి అనేక సామాజిక, నైతిక, ఆర్థిక పరమైన బాధ్యతలు నిర్వచింపబడ్డాయి. తను, తన కుటుంబము సుఖ సంతోషాలతో, చీకు, చింతా లేకుండా జీవించడమే గాక, ఆతిధి, అభ్యాగతులను ఆదరించడం కూడ అతని ధర్మంగా విధించారు పెద్దలు. ఆ విధంగా ఇంకా అనేక విధాలుగా సామాజిక బాధ్యత ఉంది. ఎవరైతే ఇతరులలో తినకుండా, తానొక్కడే తింటాడో, వాడు దొంగ కన్నా హీనుడని ‘గీత’ చెప్పింది. దీని భావం ఏమంటే అవసరాలలో వున్న వారిని ఆదుకొనడం ప్రధాన కర్తవ్యం, కాని తనకు మించిన దానం కూడదని అన్నారు. తనకు చాలినంత ఏర్పరచుకొని, ఇతరులతో కూడ పంచుకోవడం ప్రతి వారి ధర్మం.
“శ్రమించి, సంపాదించు, పంచుకో, సంపదలతో వృద్ధి పొందు, నూరేళ్ళు బ్రతుకు” అని ఉపనిషత్తులు చెప్పుతున్నాయి. సమాజ సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ధర్మాన్ని అతిక్రమించక సంపాదన చేసుకోమని’ వేదాలు, పురాణాలు, శాస్త్రాలు చెప్తున్నాయి. నూరేళ్ళు బ్రతకడం ఎలా? నీతి, శ్రద్ధాభక్తులతో వృత్తి చేసికో, సంపాదించుకో, దాచుకో. గడ్డు రోజుల కోసం జాగ్రత్తపడు. ఖర్చు చేసే సమయంలో పొదుపు పాటించకపోతే ఆదాచేయడం దుర్లభం.
ప్రకృతే ఆదా చేయడం నేర్పుతున్నది. చీమలు చూడండి ఒక్కొక గింజ ఏరుకొని, తీసికొని వచ్చి దాచుకుంటాయి. వివేకవంతుడుగా ప్రసిద్ధి చెందిన సాలమన్ రాజు అంటాడు “చీమలను చూచి నేర్చుకో” అని. రైతులు ఏం చేస్తారో మీకు తెల్సు. పంట చేతికి వచ్చినపుడు దాచుకుంటారు. సంవత్సరమంతా తింటారు. ఏనాడో పెద్దలు నాటిన వృక్షాలు, ఈనాడు ఫలాలను ఇస్తున్నాయి.
దాచుకోవడం తప్పనిసరిగా ప్రతివారూ చేయవలసి వస్తుంది. లేక పోతే వారే ఇబ్బందులకు లోనవుతారు. జీవితంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేము. జబ్బులు రావచ్చు. ప్రాణం పోవచ్చు, అంగవైకల్యం పొందవచ్చు, ఉద్యోగం ఊడవచ్చు. అనుకోని ఆర్థిక భారాలు నెత్తిన పడతాయి. వీటన్నిటికీ ప్రతివారూ తయారుగా ఉండాలి. సంపాదించడం ప్రారంభంకాగానే ఆదా చేయడం ప్రారంభం కావాలి. “భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు అన్నట్లు” “త్వరగా మొదలు పెట్టు, నిదానంగా సాగిపో, క్షేమంగా చేరుకో”. ఈ సూక్తి ఆధ్యాత్మిక రంగంలోనే గాక భౌతిక జీవితానికి కూడ వర్తిస్తుంది.
చిన్న నీటి బిందువులు సముద్రంగా అవుతాయి. అదే విధంగా చిన్న చిన్న మొత్తాల ఆదా ఒక సంపద అవుతుంది. వ్యక్తులు ఆదా చేసిన సొమ్ము ఆ వ్యక్తికి మాత్రమే కాక దేశానికి కూడ ఉపయోగపడుతుంది. బ్యాంకు లలో, గవర్నమెంట్ సెక్యూరిటీలలో, బాండ్లలో దాచుకున్న మొత్తాలు ప్రణాళికల అమలుకు తోడ్పడి దేశ అభ్యున్నతికి తోడ్పడతాయి. సొమ్ము ఆదా చేసుకోవడానికి ఎన్నో మంచి విధానాలు రూపొందించబడ్డాయి. జీవిత భీమా, బ్యాంకు డిపాజిట్లు, పోస్టాఫీస్ సేవింగ్స్ పథకాలు, కంపెనీ వాటాలు, యూనిట్లు వగైరా ఉన్నాయి. ఎవరికి వారు తమకు ఏది అనుకూలమో ఆలోచించి ఆ పెట్టుబడులు పెట్టాలి. డబ్బు అనేక ఉత్పత్తి సాధక ప్రణాళికలో ఖర్చు చేయబడి, అనేక లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సాంఘిక సంక్షే మము కల్పిస్తుంది.
కాని మరొక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. మనిషి ఒక్క డబ్బుతోమాత్రమే జీవించలేడు. భౌతిక సంపదతో పాటు, ఆధ్యాత్మిక సంపద కూడ అవసరము. కాబట్టి ధనమేకాకుండా ఆధ్యాత్మికంగా కూడ మనం పెట్టుబడి పెట్టడం నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక సంపదలేని జీవితం నిస్సారము, వ్యర్థము. ఒక మహానుభావుడు అన్నాడు “మానవుడు ప్రపంచం అంతా జయించి, తన ఆత్మను కోల్పోతే ఏమి ప్రయోజనం ” అని.
కొన్నేళ్ళ క్రిందట భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ప్రశాంతినిలయంలో “స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా” శాఖనొక దానిని ప్రారంభిస్తూ “ఇదిగో ఇక్కడ ఈ బ్యాంక్, అదిగో అక్కడ ఆ బ్యాంక్ “(ఆధ్యాత్మిక నిధి) అన్నారు. ఒక వ్యక్తి ఆదా చేసికొన్నది అవసరమైనపుడు వాడుకుంటాడు. అది అతడు సంపాదించిన ఆస్థి, కాని ఈ సంపాదనలన్నీ నీటి మూటల వంటివి. నిజంగా మనం సంపాదించ వలసింది ఆధ్యాత్మిక సంపదలు. అనగా భగవంతుని మీద భక్తి, శ్రద్ధలతో మంచితనంతో జీవించడమే నిజమైన ఆస్తి అవుతుంది. అప్పుడే అతడు “ఆస్తికుడు” అవుతాడు. మోక్ష సామ్రాజ్యానికి అర్హుడవుతాడు. ఈ ఆస్తి శాశ్వతమైనది, రసమయమైనది కూడా. భౌతిక సంపదలు కరుగుతాయి, తరుగుతాయి, చేతులు మారతాయి, కాని ఆధ్యాత్మిక సంపదకు ఈ భయం లేదు. ప్రతి వ్యక్తి భగవదనుగ్రహమనే సంపదను కొల్లలు, కోల్లలుగా సంపాదించడానికి, అమూల్యంగా భద్రపరచుకోడానికి కృషి చేయాలి.
కాబట్టి మానవుడు తన జీవితాన్ని, ఇటు భౌతిక సంపదల అటు ఆధ్యాత్మిక సంపదల మధ్య సమన్వయం చేసుకోవాలి. ఎందుకనగా డబ్బు సంపాదించడం, ఆదాచేయడం చెడ్డదని ఎవరూ అనరు. ధనం లేకపోతే మానవునికి సమాజంలో గడవదు.
ముఖ్యంగా పిల్లలకు, యువతరానికి సూచనలు:-
కొందరికి చాలినంత సంపాదన లేక అనుకున్నంత ఆదా చేయలేక పోవచ్చు. విద్యార్థులకు అందుబాటులో ఉండే ధనం చాలా తక్కువ. కాని వారు కృషి చేస్తే అందులోనే కొంత ఆదా చేయవచ్చు. వృధా ఖర్చులు మానివేసి, తల్లి దండ్రులను ఇంకా డబ్బుకావాలని పీడించకూడదు. తమ పిల్లలను చదివించడం కోసం తల్లిదండ్రులు ప్రస్తుతకాలంలో ఎంతఅవస్ధ పడుతున్నారో అందరికీ తెలుసు.
ఆహారాన్ని వృధాచేయడం ఎంత నేరమో, ధనాన్ని దుబారా చేయడం అంతనేరం. సామాజికంగా అది గొప్ప ఆపరాధం. ఆదాచేయడం కన్నా మిత వ్యయము, మితభాష, మిత ఆహారము, మిత ప్రవర్తన చాలా ముఖ్యమైనవి. ఇవి లేక పొదుపు సాధ్యం, కాదు. చివరకు ముగింపుగా మనం ఎల్లప్పుడు గుర్తుంచుకొనవలసినది – “దుబారాచేయవద్దు, పొదుపు నేర్చుకో”
ఈ విధంగా ఈ క్రింద యివ్వబడిన జీవితపు విలువలను ఆచరణలో పెట్టండి:-
- ఆహారాన్ని పొదుపుచేసి, ఆకలితో ఉన్నవారికి అందివ్వడం.
- దుబారా ఖర్చులు తగ్గించి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం.
- మృదుభాషణ ద్వారా ప్రేమను పంచు.
- కాలాన్ని ప్రయోజనకరంగా వాడుకొని, సేవలో వినియోగించు.
- ప్రతిదినము నామస్మరణ, ధ్యానము అలవాటుగా చేసుకొంటూ, శరీరము, మనస్సు ఆత్మలకు దారుఢ్యం కలిగించు.
- తన కోర్కెలను అదుపులో ఉంచుకొనడమే నిజమైన పొదుపు.