మానవతా విలువలు
విశ్వములోని నైతిక ధర్మము
విశ్వమంతా ఒక నైతిక ధర్మానికి లోబడి ఉంది. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఈ విశ్వములోని ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు, అధిగమించడానికి సాధ్యముకాని ఒక నియమానికి లోబడి వుందని మనకు ఆర్థము అవుతుంది. భగవంతుని ఈ విశాలసృష్టిలో ప్రతి దానికి ఒక ప్రయోజనము ఉంది. ప్రతిదీ తన నియమాలను అతిక్రమించక, తనకు నిర్దేశింపబడిన ధర్మపరిధికి కట్టుబడి చరించినపుడే ఈ విశ్వములో సయోధ్య, శాంతి వెల్లి వెరిసి, భగవంతుని సృష్టికి ప్రయోజనము, పరి పూర్ణత్వము చేకూరుతుంది.
భగవంతుడు మానవుని తనకు ప్రతిరూపఁగా సృష్టించాడు అని అంటారు. అంటే కొంతవరకైనా దివ్యలక్షణాలు మానవునిలో వుంటాయని మనము అనుకోవచ్చును. అసలు దివ్యత్వమంటే ఏమిటో ఆలోచిస్తే, పరిపూర్ణత్వమే దివ్యత్వమని మనకు గోచరిస్తుంది. మానవునిలో కనీసం దివ్యత్వము యొక్క బీజాలు నాటబడి ఉన్నాయని అంగీకరించక తప్పదు. ఈ బీజాలు మొలకెత్తి దివ్యలక్షణాలుగా బయటపడి, తదనుగుణంగా జీవించడానికి, మానవునికి భగవంతుడిచ్చిన రెండు పరికరాలు- బుద్ధి; వివేకము. మానవుడు మంచి ఏదో, చెడు ఏదో, తన వివేకం ఉపయోగించి తెలిసికొని, తన ప్రవర్తనకు కొంత నిగ్రహం ఏర్పరచుకొని, తన స్ధాయిని దివ్య చైతన్య స్థాయికి పెంచుకోగలడు. ఇతర ప్రాణులతో పోలిస్తే మానవుని చైతన్య స్థాయి ఎంతో ఎక్కువ. ఈ అంతరం మానవుడు పుట్టిన క్షణం నుంచే ఉన్నట్లు గోచరిస్తుంది. పశు పక్ష్యాదులకు, మానవునకు ఉన్నంత ఆత్మ చైతన్యము లేదు. అవి కేవలం యింద్రియ ప్రేరితాలై చరిస్తూ వుంటాయి. కాని మానపుడు అలాకాదు. అతనికి బుద్ధి అనేది వుంది. వివేకంతో తన ప్రవర్తన దిద్దుకోగలడు. క్షణికావేశాన్ని అదుపులో పెట్టుకోగలడు. సహజ జంతు ప్రవుత్తులను అణచుకోగలడు, దివ్యలక్షణాలను ప్రదర్శించగలడు. సహజ మానవ ధర్మాలను అధిగమించి, దివ్యత్వాన్ని చేరుకోగల శక్తి, సామర్థ్యాలు మానవునిలోనే ఇమిడి ఉన్నాయి. పశుత్వము నుండి మానవత్వము, మానవత్వము నుండి దివ్యత్వము, ఇదే భగవత్సృష్టికి గల సహజ పరిణామ సోపానము.
దివ్యపరిపూర్ణ స్థాయికి చేరుకోడానికి చాలా కాలము పట్టవచ్చు. బహుశః అనేక జన్మల అవసరం కావచ్చు. కాని, కనీస మానవతా ధర్మాల పరిధిలో జీవించడం మనకు అందుబాటులో ఉన్నదే గదా? మన ప్రవర్తనకు ఒక హద్దు అనేది లేక, మనలో ఎన్నో జన్మల పూర్వవాసనల ఫలితంగా పచ్చిన పాశవిక ప్రవృత్తులు విశృంఖలంగా విహరిస్తూ, మన ప్రవర్తనను సంస్కరించకుండా, క్రమబద్ధం చేసుకోకుండా ఉన్నన్నాళ్ళు మానవులము అని చెప్పుకోడానికి సిగ్గుపడవలసి వుంటుంది. పుట్టుకలో జంతువులకన్నా పై స్థాయిలో వున్నా మానసులము అనిపించుకొనే హక్కు మనకు ఉండదు.
మానవుల ప్రవర్తనను తీర్చిదిద్దడానికి, మన శాస్త్రాలు కొన్ని నియమాలను అందించాయి. వీటినే ధర్మ సూత్రాలు అన్నారు. వీటిని నిర్లక్ష్యం చేయక అనుసరించి నప్పుడే మానవులమని చెప్పుకోడానికి అర్హత వుంటుంది. అప్పుడే భగవత్ సృష్టిలో ఇమిడి యున్న నై తిక బంధానికి లోబడి ఉన్నామని చెప్పుకోగలము.
అయిదు మానవతా విలువలు:-
ధర్మశాస్త్రాలలో క్రోడీకరించిన నైతిక సూత్రాలన్నింటిని కుదించి అయిదు మౌలిక విలువలుగా చెప్పవచ్చును.
- సత్యము
- ధర్మము
- శాంతి
- ప్రేమ
- అహింస
నైతిక, న్యాయ సూత్రాలన్నీ ఈ అయిదు ప్రాధమిక విలువల పరిధిలోకి వస్తాయి. ఇవే అన్ని మతాలకు మూల స్తంభాలవదగినవి. ఇవే శ్రీ సత్యసాయిబాబావారి ధర్మోద్ధరణ మహాకార్యానికి కూడా పట్టు కొమ్మలు. వీటిని అవగాహన చేసుకొని, దినచర్యలో ఆచరించి, ఉత్తమ మానవులుగా రూపొందడానికి ప్రయత్నిద్దాము.