ప్రార్థన అనగా ఈ విశాల విశ్వమును, అందులో నివసించుచున్న సకల చరాచర జీవరాశులను సృష్టించిన వారైన భగవంతునితో గాఢమైన సంబంధం పెంపొందించుకొనుటయే.
భగవంతుడు మనకు జీవనదాత ప్రాణశక్తి ప్రధాత. మన శారీరక మరియు సాధారణ శ్రేయస్సు కొరకై, జీవితావసరములను మనకు అందజేయు చున్నాడు.
హెన్రీ డ్రమ్మండ్ “భగవంతునితో భక్తులు కలిసి ప్రతిదినము పది నిమిషములు గడిపిన చాలును. అంత ఎందులకు? రెండు నిమిషంలో చాలును. ఆ రోజంతయు మనము దివ్యత్వమును అనుభవించెదము. ప్రతి పనిలోను మనకు ఒక మార్పు కనిపించును. అది జీవితం మంతటినీ మార్చి వేయను”.
– హెన్రీ డ్రమ్మండ్
“మనము నిత్యము చేయు ప్రార్థనలు మన ఇంటి పెరడు నానుకొని ప్రవహించు నిర్మలమైన నది జలముల వంటివి. వానిలో స్నానము చేసిన వారు ఎవరైనను పవిత్రులు, నిర్మలాత్ములు అగుదురు”
-మహమ్మద్ ప్రవక్త
“మన పిలుపు అందునంత దూరమే మనకును శివునకు నడుముగల దూరము. దేవుని విశ్వసింపుము. అతనిని ప్రార్థింపుము. “ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను. నీతోనే ఉన్నాను” అని నీతో దేవుడు మారు పలుకును”
– సత్యం శివం సుందరం-మొదటి భాగము
మన సంప్రదాయము ననుసరించి ప్రార్థనలు రెండు రకాలు-
- స్తుతి, స్తోత్రము
- ప్రార్థన
స్తుతి మరియు స్తోత్రం అన్న పదము ‘స్తు’అన్న ధాతువు నుండి పుట్టినవి. స్తుతి అనగా ప్రశంసించుట, కీర్తించుట అని అర్థము. స్తోత్రములు అనగా భగవంతుని కీర్తించునవి, ప్రశంసించునవి, ఆరాధించునవి అని అర్థం. ఇవి భగవంతుని దివ్యశక్తిని, కీర్తిని, లీలలను, సమస్త జీవులపై ఆయన ప్రసరించు దివ్య ప్రేమను, కరుణను వ్యక్తీకరించునవి.
ప్రార్థనలు- ప్రార్థన అను పదము “ప్రార్థ్” నువ్వు ధాతువు నుండి పుట్టినది. “ప్రార్థ్” అనగా వేడుకొనుట, దేనికొరకైనా అర్థించుట అని అర్థము. మనకు సహాయము చేయుమని, మనల్ని రక్షించమని, వరములిచ్చి కాపాడుమని కానీ భగవంతుడిని వేడుకొనుటయే ప్రార్థన.
లౌకిక సుఖమును, నైతిక అభ్యుదయమును, ఆధ్యాత్మిక శ్రేయస్సును మనకు ప్రసాదించి, ఉద్ధరించమని కోరుకొనడమే ప్రార్థన. ప్రార్థన అనగా భక్తితో, ధైర్యంతో, దృఢవిశ్వాసము తో భగవంతుని పిలిచే పిలుపు. ఈ పిలుపుతో అతడు మన జీవిత రథమునకు సారధియై నిలిచి, సంసార సాగరమును దాటించి, మోక్షమును ప్రసాదించును.
వేద వాఙ్మయమునందు ప్రార్థనలను *బృహమ్” అని పిలిచెదరు. ఆ పదము “బృహ్” అను ధాతువు నుండి పుట్టినది. “బృహ్” అనగా ఉన్నత స్థితికి చేర్చుట అని అర్థం.
“మానవులను ఉన్నతో న్నత స్థితికి అనగా స్వర్గం వరకు, మోక్షం వరకు చేర్చి భగవంతుని సన్నిధానమును చేరుటకు దోహదపడేదే ప్రార్ధన”. ప్రార్థన మానవుల మనసులను, ఆత్మలను భగవంతుని కడకు చేర్చునది అని అర్థం.
వేదములోని ఋక్కులు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని మొదలైన వివిధ దేవతలను ఉద్దేశించి ప్రార్థనల రూపముగా పలుకబడినవి. అంతేకాకుండా ప్రార్థనలు వివిధ దేవతలను ఉద్దేశించినవి అయినప్పటికీ, వేదములు “ఏకం సత్ విప్రాః బహుధా వదన్తి” అనగా “సత్యం ఒక్కటే. విజ్ఞులు దానిని వివిధ నామములతో పలికేదరు” అని ప్రకటించాయి. వైదిక ప్రార్థనలైన “సమస్త లోకా సుఖినో భవంతు” వంటివి సమాజ శ్రేయస్సు కొరకై చేసేవి.
స్తుతులు, స్తోత్రములు, ప్రార్థనలు-వేరు వేరు ప్రక్రియలుగా భావించబడుచున్ననూ, ఆ మూడునూ సమ్మిళితములే. ప్రతివారు భగవంతుడిని తమను రక్షించుమని, వరములు ప్రసాదించుమని, ఆర్తితో వేడుకొనుచుందురు. ఎలా అనగా పిల్లి పిల్లలు తమ తల్లి కొరకై మొరపెట్టినప్పుడు, తల్లి పిల్లి వాటిని ప్రేమతో నోట కరుచుకుని వెళ్లినట్టుగా, భగవంతుడిని కూడా మనము ప్రార్థించినచో, మన మొరనాలకించి మనల్ని రక్షించును. కానీ, మన ప్రార్థనలో చిత్తశుద్ధితో కూడుకున్న పవిత్రమైన భక్తి ఉండవలెను. హృదయంలో అచంచలమైన భక్తితో ద్రౌపదీ దేవి, శ్రీకృష్ణ పరమాత్మ వేడుకొనగా ఆ పిలుపునందుకుని పరుగున వచ్చి ఆమెను కాపాడెను. అదేవిధంగా గజేంద్రుని మొరనాలకించి వైకుంఠము నుండి పరుగున వచ్చి మొసలి బారి నుండి అతనిని రక్షించెను.
మన శరీర పోషణకు ఆహారం ఎంత అవసరమో, మన మనసు, ఆత్మ పోషింపబడుటకు ప్రార్థన అంతే అవసరము. లౌకిక శ్రేయస్సుకు, దేహ ఆరోగ్యమునకు కూడా ప్రార్థన మనకు ఎంతయో అవసరము. మన నిత్య జీవితంలో మనకు మనము చేయు ఏ పనులైనను ప్రార్థనతో కానీ, భగవన్నామము నుచ్చరించుటతో కానీ చేసినచో, అవి పవిత్రములై, ఉదాత్తములై భగవదారాధనగా మారును. కావున ప్రార్థనలు మానవుని మనస్సును పవిత్రం చేసి, బుద్ధిని వికసింప చేసి, ఇంద్రియములను నిగ్రహింపచేసి, భగవంతునితో అనుబంధాన్ని ఏర్పరచును.
ఓంకార ఉచ్ఛారణలోని వివిధ వైఖరులు:
వైఖరి- మొదటి అవస్థ మంత్రమును బిగ్గరగా ఉచ్ఛరించుట. మానసిక ఎకాగ్రత కొరకై.
మధ్యమ- ఇది రెండవ అవస్థ. దీనిలో ఉచ్ఛరింపబడుతున్న నాదము బయటికి వినపడదు. ఉచ్ఛరించువారి పెదవులు మాత్రమే కదులుచుండును. ఇది ఒక విధంగా నాదమునకును, నాదము లేకపోవుటకు నడుమ నుండెడి దశ.
పశ్యంతి- ఇది మూడవ అవస్థ. దీనిలో నాదాభివ్యక్తియే ఉండదు. నోరు తెరిచినను, మూసినను మంత్రోచ్ఛారణ కానరాదు. కానీ అప్రయత్నంగా మనసులో జపము నిరంతరము సాగుచుండును.
తురీయ: ఈ నాలుగవ అవస్థలో సాధకుడు మంత్రమునే మరచిపోవును. దాని ప్రభావం మాత్రం సాధకుని వ్యక్త చైతన్యముపై బలముగా నిలచును. వ్యవస్థలో ఆనందము సంతోషము, సుఖ తరంగములు తప్ప మరి యేవియూ ఉండవు.
మనము ప్రయత్నం పూర్వకముగా ఓంకార మంత్రమును జపించుట అలవాటు చేసుకొనవలెను. ఆ మంత్రం మన మనసు అనుకూలంగా నుండుటకై ఓంకారమునకు మన ఇష్టదైవం యొక్క దివ్య నామమును చేర్చి పలుకు చుండ వలయును. శ్వాస నెంత సహజముగా తీసుకొందుమో, ఓంకారమును కూడా అదే విధంగా జపించవలెను.
ఓంకారము మోక్షము ప్రసాదించి, అమృతత్వమును కలిగించి, భగవంతునిలో ఐక్యమును పొందించును. భగవద్గీత లోని ఎనిమిదవ అధ్యాయం అయిన “అక్షర పరబ్రహ్మ యోగము” లో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పారు. “ఓం అను అక్షర మొక్కటియే బ్రహ్మము. దానిని స్మరించుటయే నన్ను స్మరించుట. ఓంకారం ను స్మరించుచు ఎవరు దేహమును విడుచుచున్నారో, వారు పరమగతి యైన నన్ను పొందుచున్నారు”.
ఓంకార జపం మన దైనందిన జీవితంలో ఒక అభ్యాసము కావలెను. మన శ్వాస గాఢంగా, లయబద్ధంగా, క్రమబద్ధంగా నియంత్రించకపోతే, మన శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత దెబ్బతిని శాంతికి భంగం కలుగుతుంది. ఓంకార జపం మన శ్వాసను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. ఇది మనకు మానసిక ప్రశాంతతను, శాంతిని కూడా ప్రసాదిస్తుంది. మనలో ఏకాగ్రతను మరియు జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
ఈనాటి నుండి ఓంకారము మనలను ఎల్లప్పుడూ అంటిపెట్టుకొని ఉండెడి ఉత్తమ మిత్రునిగా స్వీకరించెదము గాక. మన మనసు ఓంకారమునే సదా స్మరించు చుండును గాక.
ఓంకారమును ఒక్కొక్కసారి స్మరించిన కొలది, ఒక్కొక్క అడుగు ముందుకు వేయుచూ, బాబాకు మరింత దగ్గరగా మనము చేరుదుము. కొద్దిగా వెనకనో, ముందుగాను, మనము ఆ భగవంతుని పాదపద్మములను చేరుకొని వారి సన్నిహితులము, హితులము అగుట మాత్రం తథ్యము.
ఓంకారం బిందు సంయుక్తం
నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం మోక్షదం చైవ
ఓంకారాయ నమో నమః
“బిందువుతో కూడుకొనియున్న ఓంకారమునకు అర్థము ఏమనగా? మనమందరము ఓంకారము నుండి జనించిన బిందువులమే. ఈ సత్యమును సదా మననం చేయుచూ యోగులు ఓంకారమును ధ్యానించుచున్నారు. ఈ ఓంకారను సదా ఉచ్ఛరించుట వలనను, దాని పరమార్థమును తెలిసికొనుట వలననూ మానవుడు ఆనందమును, మోక్షమును పొందగలుగు చున్నాడు. అట్టి ప్రణవమునకు నేను ప్రణామములు అర్పించుచున్నాను.